యాచకులకు సుస్థిర పునరావాసం కల్పించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. సర్కిళ్ల వారీగా వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెలాఖరులోగా కార్యప్రణాళిక అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ను కేంద్రం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు, ఎన్జీవోల సహకారంతో సర్వే నిర్వహించి యాచకులను గుర్తిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందిస్తారు. యాచకుల అర్హతల ఆధారంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తారు.
కేంద్ర ప్రభుత్వం యాచకులకు పునరావాసం కల్పించడం ద్వారా యాచకవృత్తి లేకుండా చేసే లక్ష్యంతో జాతీయస్థాయిలో ప్రచారోద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా యాచకుల రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ సహా మరో పది నగరాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఎన్జీఓలు, పోలీసుశాఖ, జీహెచ్ఎంసీకి చెందిన అధికారులతో నగరంలో ఓ వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఓ కార్యప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యాచకుల పునరావాసానికి కార్యప్రణాళికను సిద్ధంచేసిన అధికారులు ఈ నెలాఖరులోగా ఇది అమల్లోకి వచ్చే విధంగా చూడాలని నిర్ణయించారు. సర్కిళ్లవారీగా వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసుకొని కార్యప్రణాళికకు అనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.